Priyanka Gandhi: 'అంకుల్' అంటూ ప్రధాని మోదీపై ప్రియాంకగాంధీ తీవ్ర విమర్శలు

  • కాంగ్రెస్ వస్తే మీ నగలు, మంగళసూత్రం దొంగిలించి ఇతరులకు ఇస్తారని కూడా చెప్పే అవకాశముందని ఆగ్రహం
  • బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపణ
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన మోదీ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రశ్న
Priyanka Gandhi uncle dig at Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ అంకుల్ అంటూ చురక అంటించారు. శనివారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తారని మోదీ అంకుల్ ఎప్పుడో ఒకప్పుడు చెప్పే అవకాశముందని ఎద్దేవా చేశారు.

ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. తల్లులు, సోదరీమణుల బంగారం లెక్కిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని స్వయంగా బీజేపీ నేతలే మీడియాకు చెప్తున్నారని ఆమె గుర్తు చేశారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలకు మోదీ పాలనా వైఫల్యమే కారణమన్నారు.

బీజేపీ నేతలు... మోదీని శక్తిమంతుడని పొగుడుతున్నారని, ఆయన చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంటున్నారని... అలాంటప్పుడు ఆయన మన దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల ఉన్నందువల్లే మోదీ సిలిండర్ల ధరలను తగ్గించారని, అంతేకానీ ప్రజలపై సానుభూతి లేదన్నారు.

More Telugu News